Saturday, January 14, 2012

కోడి పందేల జాతర * తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో జోరు * కో..ఢీ! * జిల్లాల వ్యాప్తంగా నెత్తురోడిన కోళ్లు


* పదిచోట్ల భారీగా, మరో 300 చోట్ల చిన్నాపెద్దా శిబిరాలు,
* తొలిరోజునే చేతులు మారిన రూ. 50 కోట్లు
* జిల్లాకు తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు
* భారీగా పేకాట శిబిరాలు, ఏరులై పారిన మద్యం
* ప్రత్యేక ఆకర్షణగా ఫుడ్ ఫెస్టివళ్ళు
* స్థాయికి తగ్గట్లుగా ఖాకీలకు కాసుల పంట

ఖద్దరుకు ఖాకీకి జరిగిన పోటీలో పందెం కోడిదే పై ‘చెయ్యి’గా నిలిచింది. నిన్నటి వరకు పందాలు జరగనిచ్చేది లేదని భీష్మించిన పోలీ సులు, రాజకీయ ప్రముఖుల ఒత్తిళ్లకు తలవంచి తోక ముడిచారు. ఈ విష యం ముందే తెలిసి శిబిరాలను సిద్ధం చేసుకున్న పందాలరాయుళ్లు శనివా రం ఒక్కసారిగా బరిలో దూకారు. జిల్లా ప్రత్యేకతను చాటుతూ అట్టహాసంగా పందాల జాతర ప్రారం భించారు. ఒక చోట ఎమ్మెల్యే, మరో చోట టీవీ నటి ఈ శిబిరాలను ప్రారంభిస్తే, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఫ్యాక్షన్ లీడర్లు స్పెషల్ ఎఫెక్ట్‌నిచ్చారు. 

‘పశ్చిమ’లో చేతులు మారిన మొత్తం రూ. 50 కోట్లపైనే
తూర్పు పందెంలో ఎమ్మెల్యే రాపాక ‘పుంజు’

ఉభయగోదావరి జిల్లాలతోపాటు, కృష్ణాజిల్లాలో కోడిపందేలతో సంక్రాంతి సంబరాల జోష్ అందుకుంది. ప్రజాప్రతినిధుల అండతో విచ్చలవిడిగా జరుగుతున్న ఈ పోటీలను తిలకించేందుకు శనివారం సినీ, రాజ కీయప్రముఖులు పోటెత్తారు. కొన్నిప్రాంతాల్లో ఏకంగా ఎమ్మెల్యేలే పందేలను ప్రారంభించారు. ఈసారి పందేలు జరగనిచ్చేది లేదంటూ శుక్రవారం వరకు బీరాలు పలికిన పోలీ సులు ఇప్పుడు వాటిని కళ్లారాచూసి తరిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లోని పందేలకు పోలీసులే రక్షణగా ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పశ్చిమగోదావరి జిల్లా పందేల బరిగా మారింది. ఫ్లడ్‌లైట్లు, జనరేటర్లు, భారీ టెంట్లతో జిల్లాలోని ప్రతిపల్లెలోనూ కోడిపందేలు, పేకాట శిబిరాలు కని పించాయి. మునుపెన్నడూలేని విధంగా పందేల జాతర మొదలైన తొలిరోజునే దాదాపు రూ. 50 కోట్లు చేతులు మారాయి. ఒకచోట క్రికెట్ పోటీలను తలపించే స్థాయిలో ఎల్‌సీడీ తెరల్ని ఏర్పాటు చేయగా, మరోచోట చాంపియన్‌గా నిలిచిన పందెంరాయుడికి నజరానాగా ఇచ్చేందుకు రూ.12 లక్షల విలువైన లగ్జరీ కారును సిద్ధం చేసి ఉంచారు.

బరులకు పోలీసుల రక్షణ


తొలుత కోడిపందేలు జరగనివ్వమని చివరికి తోక ముడిచిన పోలీసులు పనిలో పనిగా కాసుల వేటలో నిమగ్నమయ్యారు. నల్లజర్లలో వారే బినామీలతో శిబిరం నిర్వహించారు. మిగి లిన చోట్ల సివిల్‌డ్రస్సుల్లో వచ్చిన పోలీసులు శిబిరాల్లోనే నిర్వాహకులతో బేరాలు కుదుర్చుకుని సంతృప్తి చెందారు. ఒక్కోపోలీస్ స్టేషన్‌కు అక్కడ నిర్వహించే శిబిరం స్థాయిని బట్టి రూ. 20 వేల నుంచి రూ.3 లక్షల వరకు ముట్టజెప్పినట్లు సమాచారం. పెదవేగి మండలం కొప్పాకలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిప్రభాకర్ స్వయంగా భారీ కోడిపందేల శిబిరాన్ని నిర్వహించారు.


నిడదవోలులో జరిగిన శిబిరంలో సినీ నటుడు బాబూమోహన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, బాలసాని లక్ష్మీనారాయణ ఈ శిబి రంలో పందేలను తిలకించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయిభీమవరం, వెంప, భీమవరంలోని శిబిరాలను సందర్శించారు. వెంప శిబిరంలో సినీనటులు చిన్నా, ఆహుతి ప్రసాద్, సినీ నిర్మాతలు కేఎస్ రామారావు, సి.కల్యాణ్ సందడి చేశారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు శిబిరాన్ని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో టీవీనటి మంజుల రిబ్బన్ కట్ చేసి కోడిపందేలను ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలో తొలిరోజే రూ.5 కోట్లకు పైగా పందాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. మలికిపురంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు పుంజు పాల్గొన్న పందెంతోనే బోణీ జరిగింది. మరో నాయకుడి పుంజుతో పావుగంటకు పైగా హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరకు ఎమ్మెల్యే రాపాక పుంజే గెలిచింది.

కృష్ణాజిల్లాలో అధికార పార్టీకి చెందిన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన నియోజకవర్గంలోని గూడూరు, పెందుర్రు, అర్తమూరు, చెరుకుమిల్లిలో పందేలను స్వయంగా ప్రారంభిం చారు. 
టీడీపీకి చెందిన కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ మండవల్లి మండలం చింతపాడులో జరుగుతున్న పందేల బరుల వద్దకు కుటుంబంతో సహా వెళ్లి వీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మాదిరిగా ఇక్కడా పందేలు నిర్వహిస్తామని శుక్రవారం ప్రకటించిన ఆయన అదేమాట ప్రకారం తన నియోజకవర్గంలో కోడి పందేలకు శ్రీకారం చుట్టారు.

ఉన్నతస్థాయిలో పందాలకు పచ్చజెండా ఊపడంతో కిందిస్థాయి పోలీస్ సిబ్బందికి కాసుల పంట పండింది. ఒక్కో స్టేషన్‌కు రూ. 20 వేల నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారు. కొన్ని చోట్ల ఏకంగా పోలీసు సిబ్బందే బినామీ పేర్లతో పందేలు నిర్వహించారు. కమ్ముకున్న కరువు, ధరల దరువు, కుంటుపడిన వ్యవసాయం కారణంగా పండుగ పందాలపై జనం ఆసక్తి చూపించకపోవచ్చునన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. జిల్లా ప్రజలు తొలి రోజునే పందాలు అయి భీమవరం, భీమవరం, వెంప, అంకన్నగూడెం, నిడదవోలు, శ్రీనివాసపురం, తాడేపల్లిగూడెం, కొణిజర్ల తదితర పది చోట్ల భారీగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో రూ. 15 కోట్లు చేతులు మారాయి. మిగతా చోట మరో రూ.35 నుంచి 40 కోట్ల వరకు పందాలు జరిగినట్లు అంచనా.
ప్రముఖుల తాకడి
పోలీసులు చేతులెత్తేయడంతో బరితెగించిన పందేలరాయుళ్లకు రాజకీయ, సినీ ప్రముఖులు అండగా నిలిచారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులతో సహా పలువురు నేతలు పందేల శిబిరాలకు రిబ్బన్ కత్తిరించి పుంజుల్ని బరిలోకి వదిలారు. కోడిపందాల స్పెషలిస్ట్‌గా పేరొందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలం అంకన్నగూడెంలో స్వయంగా పందాలను నిర్వహించారు. తండ్రితో సహా ఆయన శిబిరం వద్దే తిష్టవేసి, కత్తులతో కోళ్లు సాగించిన సమరానికి అండదండలందించారు. కామవరపుకోట మండలం కళ్లచెరువులో ఓ ప్రముఖ నేత సమీప బంధువు భారీ శిబిరాన్ని నిర్వహించారు. ఇక్కడ కోడిపందాలతో పాటు కోత ముక్కలాట జోరుగా సాగింది. ఒక్కరోజులోనే దాదాపు రూ. కోటి చేతులు మారాయి. పాలకొల్లు మండలం పూలపల్లిలో ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు పందాలను తిలకించారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కోడి పందాల శిబిరాన్ని ప్రారంభించారు. యలమంచిలి మండలం కలగంపూడిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు పందాలను తిలకించారు.

జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో టీవీ నటి మంజుల శిబిరాన్ని ప్రారంభించి సందడి చేశారు. అయిభీమవరం, వెంప, భీమవరం ఆశ్రమంలో జరిగిన పందాలను సినీ నటులు ఆహుతి ప్రసాద్, చిన్నా, నిర్మాతలు సి కల్యాణ్, కేఎస్ రామారావు, దిల్ రాజు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు టీవీ యాంకర్లు సందర్శించారు. నిడదవోలులో జరిగిన శిబిరంలో సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్, ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాల ఎమ్మెల్సీలు బలసాని లక్ష్మీనారాయణ, బొడ్డు భాస్కరరామారావు, మాజీ ఎమ్మెల్యే తోట గోవిందరాజులు తదితరులు కోళ్ల సమరానికి ప్రత్యక్ష సాక్షులుగా నిలిచారు.

తాడేపల్లిగూడెం రన్‌వే సమీపంలో ఓ రౌడీ షీటర్ కుటుంబ సభ్యులు నిర్వహించిన శిబిరంలో ఒంగోలు, నెల్లూరు, కడప ప్రాంతాలనుంచి వచ్చిన ఫ్యాక్షన్ నేతలు పాల్గొన్నారు. ఉంగుటూరులో జరిగిన పందాలను పదివేల మంది తిలకించగా, వారిలో దాదాపు వెయ్యి మంది కూ. కోటి మొత్తాన్ని పందెం కట్టారు. లింగపాలెం మండలం కొణిజర్లలో కాంగ్రెస్ నాయకుడు మోరంపూడి జగన్ ఆధ్వర్యంలో జరిగిన భారీ శిబిరానికి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన వేలాది మందితో ఆ ప్రాంతం కిక్కిరిసింది. 300లకు పైగా కార్లు, వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు అక్కడికి రావడంతో రెండు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయింది. తాడేపల్లిగూడెంలోని ఓ థియేటర్ వద్ద పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గీయులు శిబిరాన్ని నిర్వహిం చారు.

 
పందెంరాయుళ్లకు రాజభోగాలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖులతో పాటు రూ.లక్షల్లో పందాలు కాసే ప్రముఖ జూదరుల కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఏర్పాటైన దాదాపు 300 శిబిరాలకు అనుబంధంగా పేకాట కోసులు కూడా మొదలయ్యాయి. కోత ముక్కాట, గుండాటలు జోరుగా సాగాయి. మద్యం, బిర్యానీ స్టాళ్లు అన్ని చోట్లా ఏర్పాటు చేశారు. నిడదవోలు శిబిరానికి హాజరయ్యే వారికోసం ప్రత్యేకంగా పాస్‌లను ముద్రించి అందజేశారు. పాస్‌ల్లేని వారి కోసం ఎల్‌సీడీ తెరల్ని ఏర్పా టు చేసి ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పందాలను తిలకించే సదుపాయం కల్పించారు. తాళ్లపూడి మండలం పోచవరం, రావూరుపాడు, వేగేశ్వరపురం, తిరుగుడుమెట్ట, చాగల్లు మండలం మీనానగరం, చిక్కాల, మార్కొండపాడు, కొవ్వూరు మండ లం వాడపల్లి, సీతంపేట, పోలవ రం మండలం గూటాల, మామిడిగొంది, చేగొండపల్లి, దేవరపల్లి మండలం దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, యర్నగూడెం, యాదవోలు, గౌరీపట్నం, దుద్దుకూరు, పెదపాడు మండలం అప్పనవీడు, అత్తిలి మండలం కొమ్మర, అత్తిలి, తేతలి, వేల్పూరు, గుండాట, ఇరగవరం మండలం తూర్పు విప్పర్రు, ఇల్లిందలపర్రు, అయినపర్రు, రేలంగి శివారు, అయితంపూడి, పోడూరు, ఆకివీడు, కాళ్ల, బుట్టాయగూడెం మండలం దుద్దుకూరు, వెలుతురువారిగూడెం, బూసరాజుపల్లి, కామవరపుకోట మండలం కళ్లచెరువు, వెంకటాపురం, రావికంపాడు, పాతూరు, కొయ్యలగూడెం మండలం కేంద్రం కొయ్యలగూడెం, బయ్యనగూడెం, రాజవరం, కన్నాపురం గ్రామాలతో సహా సీతంపేట, రామానుజపురం, దిప్పకాయలపాడు, టి.నరసాపురం మండలం తిరుమలదేవిపేట, రాజుపోతేపల్లి, టి.నరసాపురం, జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం, అంకంపాలెం, పి.రాజవరం, ములగలంపల్లి, టి.గంగన్నగూడెం, చంద్రమ్మ కాలనీ,గోపాలపురం మండలం హుకుంపేట, కొవ్వూరుపాడు, గుడ్డిగూడెం, వెంకటాయపాలెం, వాదాలకుంట, పెదవేగి మండలం కవ్వగుంట, కొండలరావు పాలెం తదితర ప్రాంతాల్లో భారీ పందాలు జరగ్గా, జిల్లాలోని సగానికి పైగా గ్రామాల్లో చిన్నాచితకా పందాలు నిర్వహించారు.

ఖాకీలు ఖుషీ ..
కోడిపందాలు పోలీసులకు కాసుల పంటపండించాయి. పెద్ద పందాలు జరిగిన ప్రాంతాల్లోని పోలీసులకు రూ. రెండు లక్షల వరకు గిట్టుబాటైంది. మిగిలిన చోట్ల కూడా రూ. 20 వేల నుంచి లక్ష చొప్పున ముడుపులు అందడంతో ఖాకీలు ఖుషీ అయ్యారు.
పందాలపై వెబ్‌సైట్

రాష్ట్ర వ్యాప్త ప్రసిద్ది చెందిన భీమవరం కోడిపందాలపై ఉత్సాహవంతులు ఓ వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. చలనచిత్రం.కామ్‌కు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఈ సైట్‌లో పందాలు తిలకించిన వారి అభిప్రాయాలు, అనుభూతులతో పాటు ఎంత మొత్తంలో పందాలు జరిగాయన్నది కూడా పొందుపర్చడం విశేషం.
 
* యథేచ్ఛగా కోడిపందాలు
* తొలిరోజే చేతులు మారిన రూ. ఐదుకోట్లు
* పల్లెల్లో ఎటు చూసినా పేకాటశిబిరాలే..
* ‘ఎందుకో’ మూగబోయిన పోలీసుల ఫోన్లు
 
అమలాపురం : ‘పందాలు జరగనిచ్చేది లేదు..ఉక్కుపాదంతో అణిచివేస్తాం. పందాలకు పాల్పడేవారిపై జంతుహింస నివారణా చట్టంకింద కేసులు నమోదు చేస్తాం. స్థలయజమానులపై కూడా కేసులు నమోదు చేస్తాం..’ పోలీసులు చేసిన ఈ హెచ్చరికలు తాటాకు చప్పుళ్లుగానే మిగిలిపోయాయి. రాజకీయం ముందు ఖాకీ తలొంచక తప్పలేదు. కోడి పందాలకు బరి కొడుతుంటే, కోళ్ల కాళ్లకు కత్తులు తళతళ మెరుస్తుంటే, పందాలరాయుళ్ల చేతుల్లో పచ్చనోట్లు ఫెళఫెళలాడుతుంటే ప్రేక్షకపాత్ర వహించక తప్పలేదు. గతంలో ఎన్నడూ లేనిరీతిలో సంక్రాంతి తొలిరోజే రూ. ఐదు కోట్లు పైగా చేతులు మారాయి. ఏజెన్సీ, మెట్ట, కోనసీమ అనే తేడా లేకుండా దాదాపు జిల్లావ్యాప్తంగా పందాలు జరిగే గ్రామాలన్నీ పందెపు రాయుళ్లతో కిటకిటలాడాయి.
అన్నట్టుగానే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మలికిపురంలో దగ్గరుండి మరీ కోడిపందాలు ఆడించడం పరిస్థితికి అద్దం పట్టింది. ఏటా భోగి మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి పందాలు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది ఉదయం నుంచే పందాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు గుండాటలకు పలుచోట్ల అనుమతివ్వకపోవడంతో నిర్వాహకులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. పేకాటలకు మాత్రం ఎక్కడా పోలీసుల నుంచి ఎటువంటి ప్రతిఘటనలు ఎదురుకాకపోవడంతో ప్రతిచోటా పేకాటరాయుళ్ల హడావుడి కనిపించింది. మరొక పక్క లాడ్జిలు, హోటళ్లు కూడా జూదరులతో కిటకిటలాడాయి. కోనసీమ, మెట్ట, రంపచోడవరం ప్రాంతాల్లో పందాలు జోరుగా జరిగాయి.

స్థానిక రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోడిలంకలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబుతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పందాల్లో పాల్గొన్నారు. కోనసీమలో తొలిరోజే రూ.రెండున్నర కోట్లు.. మెట్ట, ఏజెన్సీ, సబ్‌ప్లాన్ ఏజెన్సీప్రాంతాల్లో మరో రెండున్నరకోట్ల వరకు పందాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. కాగా కోనసీమకు చెందిన మంత్రి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పందాలు జరగ్గా, మెట్టలోని మంత్రి నియోజకవర్గంలో తొలిరోజు పందాలు ఛాయలు పెద్దగా కనిపించలేదు. ఆది, సోమవారాల్లో మాత్రం జిల్లావ్యాప్తంగా గతంలో మాదిరిగా పెద్దఎత్తున పందాలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా జిల్లాలో దాదాపు రూ. 25 కోట్లు పైగా పందాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మరోపక్క జిల్లావ్యాప్తంగా నాటుసారా, కల్లువిక్రయాలు ఊహించని రీతిలో జోరందుకున్నాయి.

డీఎస్పీపై మంత్రి ఆగ్రహం..
ప్రజాప్రతినిధులెంత ఒత్తిడి చేసినా పలుచోట్ల పందాలపై దాడులు చేసి పెద్ద ఎత్తున పందెపుకోళ్లను స్వాధీనం పర్చుకుని, పందెపు రాయుళ్లను అరెస్టు చేసిన ఓ డివిజన్ స్థాయి పోలీస్ అధికారిపై ఒక మంత్రి నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఏటా జరిగే సంప్రదాయ ఉత్సవాలను ఎలా అడ్డుకుంటారంటూ మండిపడినట్టు తెలిసింది. ఆ అధికారిని వీఆర్‌లో పంపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు చెబుతున్నారు. మరోపక్క బిల్లులు చెల్లించలేదనే సాకుతో సరిగ్గా సమయం చూసుకొని పోలీసులు వినియోగించే ‘సెల్‌నెట్’ కంపెనీ ఇన్‌కం కాల్స్ ను సైతం కట్ చేయడంతో మూగబోయాయి. అయితే ఇది సాకు మాత్రమేనని, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సెల్‌ఫోన్‌లు స్విచ్‌ఆఫ్ చేశారంటున్నారు.

‘కోసు’ ప్రైసు మరీ హాట్ గురూ!
ఏనుగు చచ్చినా, బతికినా వెయ్యి వరహాలే అన్న నానుడి ఉంది. ఇది పందెపు కోళ్లకూ వర్తిస్తుంది. పందెంలో పోరాడి, చివరికి నేలకొరిగిన పుంజుల మాంసం అంటే మాంసాహార ప్రియులకు ఎంతో మక్కువ. ఎంత మక్కువ అంటే అలాంటి కోడిని (దీన్నే ‘కోసు’ అంటారు) కిలో రూ. 1500 నుంచి రూ. 2 వేల వరకు వేలంలో పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి పోటీలు పడి రూ. 5 వేలకు కొనుగోలు చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఈ గిరాకీకి ఓ కారణం ఉంది. పందెపు కోళ్లను బాదం పిస్తాలు, జీడిపప్పులు, కోడిగుడ్డుతెల్లసొన, ఉడికించినమాంసం, బి కాంప్లెక్స్ మాత్రలు వంటి బలవర్ధక ఆహారంతో పెంచుతుంటారు. అందుకే వాటి మాంసానికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనిరీతిలో హైదరాబాద్ స్థాయిలో మంత్రులు, రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, అనధికార ప్రముఖులు కోసు మాంసం కోసం వెంపర్లాడుతున్నారని, హైదరాబాద్‌కు వచ్చే వారిని కాస్త కోసుమాంసం తీసుకు రండంటూ పురమాయిస్తున్నారని తెలుస్తోంది. ఈ మాంసంతో చేసిన బిర్యాని, నాటుకోడి పులుసు తినేందుకు మాంసప్రియులు ఆసక్తి చూపుతారు.

1 comment:

  1. Panduga moodu rojulu kodi pandalaku licence. migata rojulalo joodam. Policelu Pattukuntaru. Adi Rajakiyanakulu anda leni varini. Okaroju tappu. marokaru right. brandi shop pettukovalante yenni licenses kavali. kodi pandalalo pettina brandhi shoplakulaku, Gundatalaku, pekatalaku license yeveru icaharu?

    ReplyDelete